Pages

Saturday, January 4, 2014

తిరుప్పావై పాశురము 20 - ఈ సంసార తాపాన్ని తొలగించగలిగేది కేవలం హరి సరస్సు మాత్రమే


అమ్మను కీర్తిస్తే స్వామికి ఆనందం, మరి అమ్మను కఠినంగా మట్లాడితే స్వామికి కష్టంగా అనిపిస్తుంది, నిన్న మన వాళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడే సరికి స్వామికి కొంచం కోపం వచ్చింది, అందుచే స్వామి లేచి రాలేదు. ఈ రోజు స్వామిని ఆయనకున్న పరాక్రమాది గుణాలతో కీర్తిస్తారు, ఆయనలో ఉండే జ్ఞానం, శక్తి, భలం, ఋజుత్వం ఇలాంటి గుణాలతో కీర్తిస్తారు. అయినను లేవలేదని, ఆయనకు ఆనందాన్నిచ్చేలా అమ్మను కీర్తిస్తారు.

ఆండాళ్ తల్లి స్వామిని మేల్కొనడానికి ఆయన వైభవాన్ని చెబుతున్నారు,  "ముప్పత్తు మూవర్ అమరర్క్కు" ముప్పై మూడు వర్గాల దేవతలను "మున్ శెన్ఱు" ఆపదరానికంటే ముందే వెళ్ళి కాపాడే "కప్పం తవిర్క్కుం కలియే!" గొప్ప భలం కలవాడివే.  "తుయిల్ ఏరాయ్" లేవవయ్యా. చావు అంటూ లేని దేవతలనేమో వారు పిలవకముందే వెళ్ళి కాపాడుతావు, ఏమాత్రం కోరిక లేకుండా, కేవలం నివ్వు ఆనందంగా ఉంటే చూసిపోవాలని కాంక్షించే మాలాంటి వాళ్ళను మాత్రం కాపాడవా, మేం నీదగ్గరికి రావడం తప్పైందా.


 "శెప్పం ఉడైయాయ్! " సత్య పరాక్రమశాలీ, అడిన మాట తప్పని వాడా, నిన్న మాతో అందరూ కలిసి రమ్మని చెప్పి, మాట ఇచ్చి, ఇప్పుడు నీ చుట్టూ తిప్పుకుంటున్నావా, ఎమైంది నీ మాట. " తిఱలుడైయాయ్" సర్వలోక రక్షణ సామర్థ్యం కలవాడా!, "శేత్తార్క్కు వెప్పమ్కొడుక్కుం విమలా!" శత్రువులకు దుఖాఃన్ని  ఇచ్చే నిర్మలుడా, ఏదోశం అంటని వాడా. "తుయిల్ ఎరాయ్" నిద్ర లేవయ్యా.

అయితే స్వామి లేవకపోయే సరికి, అయితే నిన్న వీళ్ళు అమ్మను కొంచం కఠినంగా మాట్లాడినందుకు స్వామికి కోపం వచ్చిందని గమనించి అమ్మను కీర్తిస్తారు ఇలా.  "శెప్పన్న మెల్-ములై చ్చెవ్వాయ్ చ్చిఱు మరుంగుల్" సముదాయ అంగ సౌందర్యం కల్గి, "నప్పినై" స్వామి సంబంధంతో "నంగాయ్!" పరి పూర్ణమైన అందం కలదానా! "తిరువే!" సాక్షాత్తు నీవే లక్ష్మివి "తుయిలెరాయ్" అమ్మా మేల్కో.


వీళ్ళ  ప్రార్థనకి అమ్మ కరిగి, లేచి వీళ్ళ దగ్గరకు వచ్చి, ఏం కావాలర్రా అని అడిగింది. "ఉక్కముమ్" స్నానానికి తర్వాత మాకు స్వేదం ఏర్పడితే దాని అపనౌదనానికి విసనకర్ర కావాలి, "తట్టొళియుమ్" స్నానం తర్వాత అలకరించు కోవడానికి ఒక నిలువుటద్దం కావాలి,  " తందు" ఈ రెండు ఇచ్చి "ఉన్మణాళనై" నీ స్వామిని "ఇప్పోదే" ఇప్పుడే "ఎమ్మై" మాతో కలిపి  "నీరాట్టు" నీరాడించు. ఇలా అడగటం మనకు కొంచం ఎలాగో అనిపిస్తుంది. బాహ్యంగా చూస్తే తప్పు కదా అనిపిస్తుంది. కాని దోషమేమి లేదు.

పురుషుడు ఆయనొక్కడే మిగతా జీవ వర్గం అంతా ఆయనకు చెందిందే. అందులో కొందరు ముందు ఉన్నవారుంటారు, కొందరు వెనక ఉన్నవారుంటారు. ముందున్న వారు వెనక వాళ్ళకు మార్గ నిర్దేశం చేస్తారు. అక్కడ పరమ పదంలో నిత్యశూర వర్గానికి చేందిన వారిలో మొదటిదైన లక్ష్మీదేవి, ఆ తత్వాన్ని తెలిసిన వారు, ఆ తత్వాన్ని సరిగా చూప గలిగిన వారు. మనం కొత్తగా ఒక ఊరుకి వెళ్ళి అక్కడ చెఱువులో స్నానం చేయాలంటే ఆ వూరి గురించి బాగా తెలిసిన వారి సలహాతో చేస్తాం కదా, అలాగే.

కులశేఖర ఆళ్వార్ పరమాత్మను గురించి చెబుతూ

"హరి సరస్సివి గాహ్య ఆపీయ తేజోజలౌగం
 భవమరు పరి ఖిన్నః ఖేదమద్య త్యజామి
"


హరీ అనేది ఒక గొప్ప సరస్సు, సంసార తాపాన్ని తొలగించ గలిగేది అదే. అందులో అందరూ మునగాల్సిన వాళ్ళే.  తాపం తగ్గాలనుకొనేవారంతా అక్కడే మునగాలి, వీళ్ళు వాళ్ళు అని నియమం లేదు. జీవులమైన మనకు కానీ పరమ పదంలోని నిత్యశూరులకు గాని ఉన్నది ఒకే సరస్సు, అందులో మునిగితే ఈ సంసారంలో ఉన్న తాపం అంతా తొలుగుతుంది.

ఆ హరి సరస్సు గురించి తెలిసినదానివి, నీవు మార్గం చూపిస్తే మెం దాంట్లో ప్రవేశించగలం అని, అమ్మ ఆండాళ్ తల్లి నీళాదేవిని అదే కోరుతుంది.  పరమాత్మను  చేరటానికి అమ్మ ఒక ప్రాపకురాలుగా పని చేస్తుంది. భగవంతుని యోక్క కళ్యాణగుణాల జలాలలో మనం నీరాడుతాం. దాన్నే మనకు తిరుప్పావై  అందిస్తోంది. ఇప్పుడు అమ్మ కూడా వీళ్ళతో కల్సి మార్గ నిర్దేశం చేస్తుంది. రేపటి నుండి స్వామిని అందరూ కల్సి మేల్కోల్పుతారు .



No comments:

Post a Comment