భగవంతుణ్ణి ఆశ్రయిస్తే ఫలితాలు దక్కుతాయో దక్కవో చెప్పలేం కానీ, "న సంశయోస్తి తత్ భక్త పరిచర్య రతాత్మనామ్"
ఆ భగవంతుని యొక్క అనుగ్రహాన్ని అందిచేట్టి భక్తాగ్రేసరులైన ఆచార్య ఆశ్రయణం
చేసిన వారికి సిద్ది తప్పక కలిగే తీరును, సంశయం అక్కర లేదు అని
నిరూపిస్తారు. అయితే ఆచార్యులయందు విశ్వాసం కలగటం కొంచం కష్టం, ఎందుకంటే
ఆచార్యులు కూడా మనలాగే ఉంటారు. భగవంతుణ్ణి చేర్చటానికి వీరు తోర్పడుతారని
విశ్వాసం కలగదు. ఆండాళ్ తిరుప్పావైలో కనిపించిన దాన్ని విశ్వసిస్తూ
కనిపించని దానివైపు సాగవలే అని నేర్పుతుంది. ఇక్కడ మనకు రెంటిపై విశ్వాసం
కలగాలి, ఒకటి ఇక్కడ భగవంతుణ్ణి చూపించే ఆచార్యుడిమీద, రెండవది ఆ భగవంతునికి
మరొక రూపమై ఉన్న మనకు కనిపించే అర్చామూర్తి యందు. మన కంటికి కనిపించే
సరికి మనకు నమ్మకం కలగటం కొంచం కష్టం. అయితే ఈ యుగంలో మాత్రం కేవలం విగ్రహ
రూపంలోనే కనిపిస్తాడు, ఇతర యుగాల్లో కృష్ణుడిగా, రామునిగా కనిపించేట్టు
తానూ వచ్చాడు. కనిపిస్తున్నాడు కదా, ఇతనేంటి దేవుడు అని సామాన్యులేకాదు
వేదాధ్యనం చేసిన చతుర్ముఖ బ్రహ్మ, ఇంద్రుడంతటి వారే పొరపాటు పడక తప్పలేదు.
ఇంద్రుడు దేవతల అధిపతి, పరమ గర్విష్టి. అలాంటి వానికి ఇంద్రయాగం అని
చేస్తుండేవారు గోకులంలో పెద్దలు. వానలు ఇచ్చేవాడు ఇంద్రుడని వారి విశ్వాసం.
ఒకరోజు గోకులంలో పెద్దలంతా ఇంద్రయాగం తలపెట్టారు. అందరూ ఇంద్రుడికి
అర్పించటానికి పదార్థాలను తయారుచేస్తున్నారు. అయితే కృష్ణుడికి ఇదేంటో
తెలుసుకోవాలని కూతుహలపడి, పెద్దలని ఆడిగాడు. అయితే వారు వర్షాలు ఇచ్చే
వరణుడు, ఇంద్రుడి ఆదీనంలోనే ఉంటాడుకదా, ఆ వర్షాలు వస్తేనేకదా మనకు పంటలు
పండుతాయి, గోవులకు ఆహారం లభిస్తుంది. ఆ గోవుల పాడిపై మన జీవనం ఆధారపడి ఉంది
అందుకే చేస్తున్నాం అని చెప్పారు. అయితే ఇంద్రుడు దేవతల అధిపతి, ఒక
ఉద్యోగి, ఇలాంటివారెందరో తన ఆధీనంలో పని చేస్తున్నవారు ఉన్నారు ఈ విశ్వం
యొక్క స్థితి కోసం. అలాంటిది తాను ఇక్కడే ఉంటుంటే తనను మరచిపోయి, ఆ
ఇంద్రుడి కి చేయటం ఏంటీ, ఆ ఇంద్రుడు ఇవ్వాలన్నా తాను వెనకనుండి ఇస్తేనేకదా,
ఇవ్వగలడు అని, ఆ ఇచ్చేవాన్ని నేనిక్కడే ఉండగా నన్ను కాదని చేస్తున్నారే
అని శ్రీకృష్ణుడు అనుకున్నాడు. వాళ్ళకందరికి ఈ విషయం ఎలాగో తెలుపాలి అని అనుకుని, అందరినీ
ఒక దగ్గరికి చేర్చి, వానలు ఇచ్చేది ఇంద్రుడా కాదు, సూర్యుని శక్తికి
సముద్రంలోని నీరు మేఘాలుగా మారితే, ఆపై గాలి వీస్తె మన దగ్గరకు వచ్చాయి, ఆ
గోవర్థన పర్వతం అడ్డుకోవడంచే మనకు వర్షంగా వస్తుంది. మనం గోవర్థన
పర్వతానికే ఈ పదార్థాలను అర్పించి కృతజ్ఞత తెలుపుకోవాలి అని
విన్నపించుకున్నాడు. అందరికి సభబే అనిపించి అందరూ ఆ గోవర్థన పర్వతానికే
పదార్థాలను సమర్పించారు. తనే పర్వతంలో ఆవేశించి, నైవేద్యం పుచ్చుకున్నాడు.
ఇంద్రుడికి పదార్థాలు అందకపోవడంచే ఆగ్రహించి ఏడు రోజులు వరుసగా రాల్ల వాన
కురిపించాడు. ఇదిగో మనం చేసిన తప్పుకి ఇంద్రుడు ఆగ్రహించాడు, కన్నయ్యా అని
అందరూ కృష్ణుణ్ణి చేరగానే, మనం ఆరగింపు ఇచ్చిన ఆ కోండే మనల్ని కాపాడదా ఏం
అంటూ ఒంటి వ్రేలితో కొండను ఎత్తి అందరిని రక్షించాడు. గోవర్థనోద్దారి
అయ్యాడు ఆయన. ఇంద్రుడు తనకని అర్పించినవి తానే తినాలి అనుకున్నాడు, ఆ
ఇంద్రుడిలోనూ ఉండేవాడు కృష్ణుడేకదా, అదే శ్రీకృష్ణార్పణ మస్తూ అని
అనుకునేవాడైతే అన్ని పదార్థాలు ఉండేవి, నేనే తింటున్నాను, నాలోని పరమాత్మకు
కాదు అని భావించాడు కాబట్టే ఇంద్రుడికి బుద్ది చేప్పే పరిస్థితి
కల్పించాడు కృష్ణుడు. ఇంద్రుడంతటి వానికే తన ప్రభువు ఇతను అని ఇంగితం లేదు
అంటే మన లాంటి సామాన్యులం మనం ఏం చెప్పగలం.
అయితే ఇంద్రుడు దేవతల లో ఒకడు, మరి ఆ దేవతల అందరికి
అదిపతిగా ఉండే చతుర్ముఖ బ్రహ్మకు కూడా ఈ పరిస్థితి తప్పలేదు. గోకులంలో
కృష్ణుడి లీలలు అందరూ చెప్పుకుంటుంటే, బ్రహ్మకు కూడా అసూయ కలిగి, ఇదేదో
చూడాలి అని గోకులంకు వచ్చాడట. ఆ రోజు కృష్ణుడు ఆ గోపబాలుర మద్య కూర్చుని
సద్దులు ఆరగిస్తుండగా చూసి, ఈ ఎంగిలి వేషాలు వేసే వాడా దేవుడంటే అని
అనుకుని, ఈ వ్యక్తి ఏంటో ఇంద్రజాలం చేస్తున్నాడు, వీడికి బుద్ది చెప్పవలె
అని అనుకున్నాడు. గోవులను అపహరించి ఒక గుహలో దాచాడు. అంతలో ఒక గోప బాలుడు
వచ్చి కృష్ణా మన గోవులు కనిపించటంలేదు అని చెప్పాడు, కృష్ణుడు వాటిని
వెతుకుతూ అటు వెళ్ళగానే, గోపబాలురనూ అపహరించి మరొక గుహలో దాచాడు బ్రహ్మ.
అయితే గోప బాలురను వదిలి వెడితే గోకులంలోని వారంతా కృష్ణుణ్ణి దేహశుద్ది చేస్తారు
అని అనుకున్నాడు బ్రహ్మ. ఇక బ్రహ్మ లోకం కి బయలుదేరాడు
బ్రహ్మ, ఇది చూసి శ్రీకృష్ణుడు బుద్ది చెప్పాలని నిర్ణయించుకున్నాడు.ఎన్నెన్ని దూడలు, ఎన్నెన్ని గోవులు, ఎందరెందరి గోపబాలురను
బ్రహ్మ దాచాడో అందరి రూపాలను తనదిగా చేసుకున్నాడు కృష్ణుడు. అందరి రూపాలు
ఆయనే దాల్చాడు, వారి వారి ప్రవృత్తులతో సహా ఏడాది కాలం అట్లానే ఉన్నాడు.
గోకులంలో ఇప్పుడు అందరి రూపాల్లో ఉన్నది కృష్ణుడే అవటంతో నందగోకులం అంతా
ఆనంద తరంగితం అయ్యింది. ఇక్కడిది చేస్తూ బ్రహ్మ లోకం వెళ్ళి బ్రహ్మ రూపు
దాల్చి, అక్కడివారితో తన రూపు వేసుకొని ఒకడు వస్తాడు బాగా శుద్ది చేయండి
అని చెప్పి వచ్చాడు కృష్ణుడు. బ్రహ్మకు తనలోకంలో కూడా ఆదరణ లేకుండాపోయి నంద
గోకులం చేరి చూస్తే ఎక్కడి పిల్లలు అక్కడ, ఎక్కడి గోవులు అక్కడ
కనిపించాయి. ఆశ్చర్య పడి తాను దాచిన గుహల్లో చుస్తే తను దాచినవి
కనిపించాయి. మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా చూస్తే ప్రతి రూపంలో కృష్ణుడే
కనిపించాడు. అప్పుడు ఆ చిన్నారి కృష్ణుడిపై మూడు తలలు వాల్చి స్వామి
స్వరూపాన్నీ కీర్తన చేసి, ఎందుకిచ్చావీ బ్రహ్మ పదాన్ని, ఎంత పదవి
కట్టబెట్టావో అంత గర్వం కూడ నాకు పెరిగింది, ఈ గర్వం లేని గోప జనం ఎంత
అదృష్టవంతులయ్యా, అలాంటి వారి పాద దూళినైనా బాగుండేది అని బ్రహ్మ అంతటివాడు
పశ్చాత్తాపం చేందాడు.
అలాగే ఒక చిన్న స్వరూపం భగవంతుడు దరించే సరికి
మనకు ఒక అవజ్ఞత, చులకన భావం ఏర్పడుతుంది. కనిపించక పోతే అమ్మో అంటాం,
కనిపిస్తే ఓసీ ఇంతేనా అంటాం. ఆనాడు బ్రహ్మ, ఇంద్రులకి కనిపించే వాడిపై
విశ్వాసం కలగలేదు కారణం ఆచార్య అనుగ్రహం లేక పోవటం. అదే భగవంతుడు ఈనాడు
అర్చా స్వరూపం లో ఉన్నాడు. అయితే కొందరు కనిపించే శక్తిని బట్టి తత్వాన్ని
గుర్తించాలని అది అగ్నిహోత్రంలో, ఆదిత్యున్నిలో, జ్ఞానుల హృదయాల్లో
భగవంతుణ్ణి దర్శించాలని అని చెప్పారు. సామాన్యులకి మానసిక ఆధారం కోసం ఏదో
ఒక రూపం ఉండాలి కనుక మొదటి మెట్టుగా ఈ విగ్రహాంలో చూడొచ్చు, ఆపై విగ్రహం
లేకుండా శక్తిరూపాల్లో భగవంతుణ్ణి చూడాలి అని చెప్పారు. కాని అది తప్పు.
ఒకటి తర్వాత ఒకటి పై పై కి చూపిస్తూ ఉన్నాయి కనుక, కాలుస్తోంది కనుక
అగ్ని, ఆపై కాల్చకుండానే నిత్యం కాంతినిస్తుంది కనుక
సూర్యుడు, ఆపై కదల్చ
కుండానే చైతన్యంచే కదుపుతోంది కనుక
హృదయాన్ని ఉపాసన చేస్తాం. "ప్రతిమాసు అప్రబుద్దానాం"
అంటే విగ్రహం అనేది వీటికంటే ఎదో పైకే చెంది ఉండాలి. కేవలం శక్తిని
బట్టేనా గుర్తించేది, తత్వం బట్టి కదా, అలా తత్వాన్ని గుర్తించగలిగేవాడు
ప్రతిమ లేక విగ్రహంలో గుర్తిస్తాడు. అలాంటివాడు బాహిరమైన వాటియందు దృష్టి
ఉండని వాడు మాత్రం గుర్తిస్తాడు. ఎలాగంటే, ఒక విద్యుత్ తీగను చూసి అదేం
కాలటంలేదు, వెలగటం లేదు అని ముట్టు కుంటే ప్రాణం తీస్తుంది. కాని అదే తీగ
అంచుకు చేరగానే ఒక విద్యుత్ దీపాన్ని వెలిగిస్తుంది అని తెలిసినవాడు ఈ
బాహిరమైన వాటియందు దృష్టి లేకున్నా ఆ లోపల విద్యుత్ తత్వాన్ని తెలుసుకొని
ఉంటాడే. అలాగే విగ్రహ స్వరూపం కదలక పోయినా, భగవత్ సాక్షాత్కారానికి మొదటి
మెట్టే కాదు, చివరి మెట్టు కూడా. విగ్రహంలో కూడా తత్వం ఉందని కాదు, "విగ్రహమే తత్వం" అని గుర్తించాలి.
ఆండాళ్ తిరుప్పావై సారాంశం ఆ విగ్రహం పై విశ్వాసం
కలిగించటమే. అందుకే ఆండాళ్ శ్రీవెల్లిపుత్తూర్ లో వటవత్రశాయిని
కొలిచింది, వేంకటాచలపతినికి శరాణాగతి చేసింది, తిరుమాలైజోలు సుందరభాహునికి
మొక్కుబడి చేసింది, శ్రీరంగనాథున్ని చేరింది, శ్రీకృష్ణుడిని మనస్సులో
భావించింది, పాల్కడలిలో స్వామిని పాడింది. ఇన్నింటిలో తత్వం ఒకటే అని తన
ఆచరణ ద్వారా మనకు చూపించింది ఆండాళ్. అలాగే ఆచార్యుని ద్వారా భగవంతుణ్ణి
దర్శించవలెనని తెలిపింది. భగవంతుణ్ణి ఆరో స్వరూపంగా ఆచార్యులలో చూడవచ్చునని
తెలియజేసింది. మొదట ఆ విశ్వాస పూర్ణత మనకు ఏర్పడితే, ఆ పూర్ణతత్వాన్ని మనం
దర్శించగలం.
నిన్న అమ్మని లేపారు, ఆమ్మ లేచి నేను మీ తోటిదాన్నే కదా, పదండి అందరం కల్సి స్వామిని లేపుదాం అని వీళ్ళతో కలిసింది. ఇక మనవాళ్ళంతా స్వామి వద్దకు చేరి "శ్రీమన్నారయణ చరణౌ శరణం ప్రపద్యే" అంటూ శరణాగతి చేస్తున్నారు. ఉపాయం భగవంతుడే అని మనకు తెలుసు, అమ్మ మనల్ని ఆయనతో చేర్చే ప్రాపకురాలిగా ఉంది. అమ్మ ద్వారా పొందిన జ్ఞానంతో మన వాళ్ళు ఇలా ప్రార్థన చేసారు. ఈరోజు మనవాళ్ళు "మగనే!" కుమారుడా "అఱివుఱాయ్" తెలివి తెచ్చుకో అంటున్నారు. ఐతే మన వాళ్ళకు శ్రీకృష్ణుడిని నేరుగా ఆశ్రయించకూడదు, ఆచార్యుడైన నందగోపుని ద్వారా ఆశ్రయించాలి అని తెలుసు, అందుకే నందగోపుడి లక్షణాలు తెలుపుతూ "ఆత్త ప్పడైత్తాన్" లెక్కకు అందనన్ని "వళ్ళల్ పెరుం పశుక్కళ్" ఇచ్చే ఔదార్యం కల్గిన పశువులు, శ్రీకృష్ణుడికీ ఇదే ఉదార స్వభావం కదా ఇది నందగోపుని సంబంధంతోనే కదా వచ్చింది. ఇచ్చే స్థితి తనది పుచ్చు కోనివాడిదే లోటు అన్నట్లు ఆ పశువులు ఎప్పుడు వెళ్ళినా, ఎవరు వెళ్ళినా పాలు ఇచ్చేవి, ఎలా ఇచ్చేవి ఆ పాలు అంటే "ఏత్త కలంగళ్" ఎన్ని కుండలు పెట్టినా, "ఎదిర్ పొంగి మీదళిప్ప మాత్తాదే పాల్ శొరియుమ్" పాల ధారలు పొంగుతుంటాయి, ఆ పొంగటం క్రింది నుండా పాలు పొంగుతున్నాయి అన్నట్లు ఇచ్చేవి. ఇక్కడ నందగోపుడు ఆచార్యుడు, గోవులు శాస్త్రములను అధ్యయనం చేసిన మహనీయులు, ఆ శాస్త్రములు కఠినమైనవి, గోవులు వనం అంతాతిరిగి అక్కడి పచ్చికను తిని, అనుభవించి మనకు స్వచ్చమైన పాలను అందించినట్లే, జ్ఞానులైన మహనీయులు శాస్త్రారణ్యాలలో సంచరించి అక్కడి క్లేషాలను తాము అనుభవించి తత్-సారమైన భగవత్-గుణములైన పాల దారలను మనపై కురిపిస్తారు. కుండలు శిష్యులలాంటివి అనుకోవచ్చు, ఆ ఇవ్వడం నాలుగు కారణాలనే పొదుగుల ద్వారా ఇస్తుంటారు, తమకు పెద్దలు ఇచ్చారు కనుక ఇవ్వాలని కొందరు, ఆవలి వాడు అడుగుతున్నాడే అని కొందరు, ఆవలి వాడు కష్టపడుతున్నాడే అని తీర్చడానికి కొందరు, తమకు తెల్సింది చెప్పకుండా ఉండాలేక కొందరు ఇస్తుంటారు. అలాంటి జ్ఞానులనెందరినో శిష్యులుగా కల వారు మన రామానుజాచార్యులవారు. అలాంటి ఆచార్యులవద్ద కుమారుడిగా ఉండే స్వామి తెలివి తెచ్చుకో, నీవు వచ్చింది గోకులానికి, నీవై కోరి వచ్చావు మాలాంటి వారి వద్దకి. పరమపదం లో నిత్యశూరులవద్ద తన సంకల్పాన్ని గుర్తించి చేసేవారుండగా, తనను తాను తెలియనివాడైనందుకే కదా, మా మద్యకు వచ్చి మా అరాధన అందుకుంటున్నావు, ఇది మా పాలిట నీదయ. "ఊత్త ముడైయాయ్! పెరియాయ్!" నీకు దృడమైన ప్రమాణం నీకుంది వెనకాతల, వేదైక వేద్యుడివి, ఆ వేదానికే అందనివాడివి, అలా అందనివాడివి "ఉలగినిల్ తోత్తమాయ్ నిర్ఱ" మా మద్యకు అందే వాడిలా వచ్చి "శుడరే!" దివ్య కాంతులీడుతూ ఉన్నావు, మేం క్రమం తప్పకుండా మీ అమ్మ నాన్నలను లేపి వారి ఆజ్ఞతో వచ్చాం "తుయిల్ ఎరాయ్" తెలివి తెచ్చుకో. వాళ్ళు ఎట్లా వచ్చారో విన్నపించుకున్నారు "మాత్త్తార్" శత్రువులైన వాళ్ళు "ఉనక్కు వలి తొలైందు" వాళ్ళ భలాన్ని ప్రక్కన పెట్టుకొని "ఉన్-వాశఱ్కణ్" నీ ద్వారం ముందు పడిగాపులు పడేవాళ్ళలా "ఆత్తాదు వందు" ఎక్కడైతే నీ భాణాల దెబ్బలకు బయపడి "ఉన్-అడిపణియుమా పోలే" నీపాదాలనే సేవించుకొనేట్లుగ వస్తారో, మేం అలానే వచ్చాం, దింతో స్వామికి భాద అయ్యి, మీకు శత్రువుల పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నట్లుగా భాద పడ్డాడు, లేదయ్యా "పోత్తియాం వందోమ్" మేం కుడా ఒకనాడు వాళ్ళకేం తిసిపొలేదయా, ఒకప్పుడు మేం అభిమానం కల్గి మేం నీ దగ్గరకి రావటం ఏంటి అనుకునే వాళ్ళం, కానీ నీవంతటివాడివి ఇక్కడికి దిగి వచ్చావు, మాదగ్గరికి కూడా రాగలవు, కానీ మేం ఆగలేక పోతున్నాం, అర్తి తక్కుటుకోలేక నీ పాద ఆశ్రయణం కోసం వచ్చాము. అయితే శత్రువులు వాళ్ళ శరీరాన్నీ కాపాడుకోవటానికి నీ దగ్గరికి శరణూ అంటూ వస్తారు, మేం మా ఆత్మ రక్షణ కోసం వచ్చాం, వాళ్ళు నీ భలానికి లొంగి వస్తే మేం నీ గుణాలకు లొంగి వచ్చాం, వాళ్ళు నీ భాణాల దెబ్బలకు తట్టుకోక వస్తే మేం నీ కళ్యాణ గుణాల దెబ్బలకు తట్టుకోక నీ కళ్యాణ గుణాల కీర్తన చేద్దాం అని వచ్చామయ్యా "పుగరందు" ఆనందంతో వచ్చాం, ఇక పై అంతా నీ భాద్యత అంటూ శరణాగతి చేసారు.
No comments:
Post a Comment